లగడపాటి చెప్పిందే జరగబోతోంది... కారణమేంటంటే...!: బుద్దా వెంకన్న వివరణ

  • తెలంగాణలో ప్రజాకూటమిదే విజయం
  • జాతీయ మీడియా సర్వేలు పాతవి
  • చంద్రబాబు ప్రచారానికి వచ్చాక పరిస్థితి మారింది
  • టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధించబోతున్నదని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే నిజమవుతుందని అన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తన వాదనకు కారణాన్ని చెబుతూ, జాతీయ సర్వేలన్నీ చంద్రబాబు ప్రచారానికి వెళ్లకముందు చేసినవని అన్నారు. కొన్ని సర్వేలు టీడీపీ, కాంగ్రెస్ కలవకముందు చేసినవి కూడా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని కేసీఆర్ తూలనాడటం మొదలైన తరువాత ఓటర్లలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.

చంద్రబాబు తెలంగాణకు వెళ్లి ప్రచారం చేయడం, ఆపై రాహుల్ గాంధీతో కలసి ఒకే వేదికపై కనిపించడం వంటి కారణాలతో ఓటర్లు ప్రజా కూటమివైపు మొగ్గారని అన్నారు. తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని చంద్రబాబు తపిస్తుంటే, కేసీఆర్ ఆయన్ను తిట్టడం ప్రజలకు నచ్చలేదని అన్నారు. మాజీ ఎంపీ రాజగోపాల్ సర్వే క్షేత్రస్థాయిలో జరుగుతుందని, ఎన్నికలు ముగిసి పోలింగ్ ముగిసేంత వరకూ ఆయన సర్వే జరుగుతుందని, అందువల్ల తాను దాన్నే నమ్ముతున్నానని అన్నారు. గతంలో లగడపాటి చెప్పిన ఎన్నో సర్వేలు నిజమైన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. టీఆర్ఎస్ నేతల ఆనందం మూన్నాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Budda Venkanna
Telangana
Lagadapati
Survey
Exit Polls

More Telugu News